నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తల్లి కోటంరెడ్డి సరళమ్మ (72) మృతితో సంగం మండలం పడమటిపాళెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఆమె గతంలో తమకు చేసిన సాయాన్ని గుర్తుచేసుకుంటూ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.తల్లి మృతి చెందారనే సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పడమటిపాళేనికి శుక్రవారం రాత్రి చేరుకున్నారు. తల్లి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కన్నీరు పెట్టడం చూసి గ్రామస్తులు, స్నేహితులు సైతం కన్నీటి పర్యంతమయ్యారు. రెండో కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ కార్యాలయ ఇన్చార్జి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సరళమ్మ మృతదేహానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఏసునాయుడు, విజయా డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఎమ్మెల్యే కోటంరెడ్డికి మాతృ వియోగం