కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్ సింగ్‌పై కేసు నమోదు

 సీనియర్‌ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై మధ్యప్రదేశ్‌లో కేసు నమోదైంది. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఎడిటెడ్‌ వీడియోను ఉద్దేశపూర్వకంగానే సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారంటూ బిజెపి నేతలు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు వీడియోను పోస్ట్‌ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.లిక్కర్‌కు సంబంధించి మాట్లాడిన పాత వీడియోను వారికి అనుకూలంగా ఎడిట్‌ చేసి పోస్ట్‌ చేశారని అన్నారు. కాగా, శివరాజ్‌సింగ్‌ నేతృత్వంలో ఆదివాసీలను మోసం చేసిన కేసును లేవనెత్తడంతో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని అన్నారు. నకిలీ విడియోపై నిరభ్యంతరంగా దర్యాప్తు చేపట్టవచ్చని దిగ్విజయ్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు. కాగా, సైబర్‌ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భోపాల్‌ డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ ఇర్షాద్‌ వాలి పేర్కొన్నారు.