డాక్టర్ సుధాకర్ తల్లి కావేరిబాయి గురువారం హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. తన కొడుకు సుధాకర్ను అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నారని, 24 గంటల్లో ఆయనను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ పిటిషన్ వేశారు. విచారణ అనంతరం ఎపిలో సంచలనంగా మారిన విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ వైద్యశాల మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్కు తెలియజేసి ఆయన అనుమతితో సుధాకర్ ఎప్పుడైనా డిశ్చార్జ్ కావొచ్చని హైకోర్టు సూచించింది. అయితే సిబిఐ విచారణకు మాత్రం సహకరించాలని సుధాకర్కు సూచించింది. మరోవైపు తనను విశాఖ మెంటల్ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలించాలని డాక్టర్ సుధాకర్ వేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ప్రస్తుతం డాక్టర్ సుధాకర్ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తోంది.
