ఢిల్లీ హైకోర్టులో సీనియారిటీలో మూడవ స్థానంలో ఉన్న జస్టిస్ ఎస్. మురళీధర్ను పంజాబ్,హర్యానాకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. తమను బదిలీ చేయాలంటూ కోరిన మరో ఇద్దరిని కూడా బదిలీ చేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ ఎస్ఎ.బాబ్డే వెల్లడించారు. ఈ నెల 12న తీసుకున్న తీర్మానాలు బుధవారం సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ అయ్యాయి. బాంబే హైకోర్టు జడ్జి రంజిత్ వి.మోర్ను మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేసేందుకు, అలాగే కర్ణాటక హైకోర్టు జడ్జి రవి విజరుకుమార్ మాలిమత్ను ఉత్తరాఖండ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం సిఫారసు చేసింది. అయితే ఢిల్లీ హైకోర్టులో రెండవ సీనియర్ జడ్జిగా ఉన్న జిఎస్.సిస్తానీ మార్చి 2020లో పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో.. మురళీధర్ను బదిలీ చేయాలన్న సిఫారసుపై బార్ అసోసియేషన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ డిఎన్. పటేల్ 2022లో పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో.. జస్టిస్ మురళీధర్ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్గా మరికొంతకాలం పనిచేసే అవకాశం ఉందని అసోసియేషన్ పేర్కొంది. దీంతో బుధవారం మధ్యాహ్నం అత్యవసర సమావేశంలో ఈ బదిలీని వ్యతిరేకిస్తూ.. గురువారం విధులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.
