తెలంగాణలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో మే 7 తరువాత, మరికొన్ని రోజులు లాక్ డౌన్ ను పొడిగించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలంతా ఇళ్లలో ఉంటేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని, ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో వ్యాఖ్యానించిన ఆయన, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే వీడియో కాన్ఫెరెన్స్ లో దేశంలో పరిస్థితి తెలుస్తుందని అన్నారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని గుర్తు చేసిన ఆయన, ప్రధానితో మాట్లాడిన తరువాత భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుందామని అధికారులతో అన్నట్టు తెలుస్తోంది.
