ఉరిశిక్ష అమలు నుంచి తప్పించుకునేందుకు నిర్భయదోషులు అనేక ప్రయత్నాలు చేస్తుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ మరణశిక్ష నుంచి తప్పించుకోవడానికి దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ మరో అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాడు. తన క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. శుక్రవారం ఎన్నికల కమిషన్ను ఆశ్రయించాడు. వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించిన సమయంలో ఢిల్లీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందంటూ దోషి తరపున న్యాయవాది ఏపీ సింగ్ మరో వాదనను తీసుకోవచ్చారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించే అధికారం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు లేదని తెలిపారు. తిరస్కరించిన పిటిషన్పై సిసోడియా డిజిటల్ సంతకం చేయాల్సి ఉండగా.. పిటిషన్ను తిరస్కరించినట్టు వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపారనీ, క్షమాభిక్ష పిటిషన్ను తిరస్కరించడానికి మంత్రి అనర్హుడని న్యాయవాది ఏపీ సింగ్ వాదించారు. ఈ పిటిషన్ను తొలుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు, ఆపై రాష్ట్రపతికి పంపుతారు. కాగా వినయ్ శర్మ మానసిక పరిస్థితి బాగోలేదనీ.. తన సొంత తల్లిని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నదనీ, శర్మ తలకు తీవ్రగాయమైందనీ, కుడి చేయి విరిగిందనీ. అతనికి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరముందని న్యాయవాది ఏపీ సింగ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
