పార్లమెంట్ రెండో విడుత బడ్జెట్ సమావేశాలు నేటీ (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగే ఈ సమావేశాల్లో వ్యవహరించిన వ్యూహాలను అధికార, ప్రతిపక్షాలు రచిస్తున్నాయి. ఇటీవలి ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న మతోన్మాద హింస, దేశంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సమాయత్తం అవుతున్నాయి. మరోవైపు వీలైనన్ని ఎక్కువ బిల్లులను ఆమోదించుకునేందుకు ప్రభుత్వం యత్నిస్తుంది. అలాగే బడ్జెట్ (డిమాండ్స్ అండ్ గ్రాంట్స్)పై రెండో దశ చర్చ జరుగుతుంది.
33 రోజుల పాటు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో 22 రోజుల పాటు సభా కార్యక్రమాల నిర్వహణ జరుగుతుంది. 11 రోజులు పార్లమెంట్కు సెలవుగా ఉండొచ్చు. సుదీర్ఘంగా జరిగే ఈ సమావేశాల్లో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లుపైన చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజా సమస్యలకు సంబంధించి ప్రశ్నలు సంధించేందుకు ప్రతిపక్షాలు యోచిస్తోన్నాయి. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు, దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనంపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రణాళికలపై ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది.
