కరోనా కట్టడికి లాక్డౌన్ను మే 31 వరకూ పొడిగించిన కేంద్ర ప్రభుత్వం ఆదివారం సాయంత్రం లాక్డౌన్ మార్గదర్శకాలను జారీ చేసింది. విమాన, మెట్రో సర్వీసులకు అనుమతి లేదని, హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్ను అనుమతించబోమని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకే అనుమతిస్తామని పేర్కొంది. కరోనా కేసుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే రాష్ట్రాలపై చర్యలు చేపడతామని పేర్కొంది.పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు మే 31 వరకూ మూసివేసే ఉంటాయని స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు మే 31 వరకూ తెరిచేందుకు అనుమతి లేదని కేంద్రం తేల్చి చెప్పింది. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, జిమ్ సెంటర్లు, స్విమింగ్ పూల్స్, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్లు మే 31 వరకూ తెరిచే పరిస్థితి లేదని కేంద్రం ప్రకటించింది. మే 31 వరకూ.. ప్రతిరోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. కంటైన్మెంట్, రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లపై రాష్ట్రాలదే అధికారం అని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రాల పరస్పర అనుమతితో ప్రజారవాణా వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. రెస్టారెంట్లకు హోం డెలివరీ అందించేందుకు మాత్రమే వెసులుబాటును కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
