మచిలిపట్నంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు బందరు ప్రజల తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మంత్రి పేర్ని నాని కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి తన చర్మం వలిచి చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేనన్నారు. బందరులో ఏర్పాటు చేయబోయే కళాశాలకు వైఎస్ రాజశేఖర్రెడ్డి మెడికల్ కాలేజీగా నామకరణం చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన పదినెలలలోపే కార్యరూపం దాల్చే విధంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మచిలిపట్నం ప్రజల కలను నిజం చేసిన సీఎం జగన్కు రుణపడి ఉంటామన్నారు. క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ను కూడా మచిలీపట్నంలో ఏర్పాటు చేయాలని సీఎం ను కోరామని పేర్ని నాని పేర్కొన్నారు.
