అధిక చార్జీలపై హై కోర్ట్ మరో సారి ఆగ్రహం

ప్రైవేటు ఆస్పత్రుల ఆగడాలపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడింది. అపోలో, బసవతారకం ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయని దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు బుధవారం విచారించింది. కొందరు పేదలకు ఉచితంగా వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరలకే పలు ఆస్పత్రులకు భూమి కేటాయించిందని పిటిషనర్‌ కోర్టుకు తెలిపారు. రాయితీ ధరలకే భూమి పొందిన అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం లేదని ఆరోపించాడు.దీంతో షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధిక బిల్లులు చెల్లించక పోతే మృతదేహాలను కూడా అప్పగించడం లేదని హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని, భూములు వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విశ్రాంత ఉద్యోగి ఓ.ఎం. దేవర ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.