ఎస్‌ఇసి నిమ్మగడ్డతో ప్రభుత్వ ప్రతినిధి బృందం భేటీ..

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధి బృందం శుక్రవారం సమావేశం అయ్యింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్‌ దాస్‌, పంచాయితీ రాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ నిమ్మగడ్డను కలిసిన బృదంలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని కమిషన్‌ ప్రొసీడింగ్స్‌ ఇచ్చిన నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరుగుతోంది. హైకోర్టు సూచించిన మేరకు.. ప్రభుత్వం తరుఫున ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చిస్తోంది. ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం యోచిస్తోన్న నేపథ్యంలో ఈ భేటీలో ఎలాంటి నిర్ణయానికి వస్తారన్నది ఆసక్తిగా మారింది.