ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయింది. ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే కొనసాగించనున్నట్టు ఎస్‌ఇసి ప్రకటించింది. ఈ మేరకు 75 మున్సిపాలిటీలు, 12 మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 10 న పురపాలక ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎస్‌ఇసి ప్రకటన విడుదల చేసింది. 14 వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. మార్చి 3 న మధ్యాహ్నం 3 గంటల్లోపు నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువుగా నిర్ణయమయింది. గత ఏడాది మార్చి 23 న నిర్వహించాల్సిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా అదే నెల 15 న వాయిదా పడ్డాయి. 12 నగరపాలక సంస్థల్లో డివిజన్లు, వార్డులకు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులుగా, స్వతంత్రులుగా 6,563 మంది అప్పట్లో నామినేషన్లు వేశారు. 75 పురపాలక, నగర పంచాయతీల్లోనూ వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ దశలో ఎన్నికలు వాయిదాపడ్డాయి. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు దశల్లో పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తోంది. వాయిదా వేసిన పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ఎస్‌ఇసి తాజాగా నిర్ణయించింది.