ఇజ్రాయిల్ ప్రధానమంత్రి నఫ్తలి బెన్నెట్ ఏప్రిల్ 2 నుంచి నాలుగురోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలు 30వ వార్షికోత్సవాన్ని నిర్వహించకుంటున్న సందర్భంగా ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు నఫ్తలి బెన్నెట్ భారత పర్యటనకు విచ్చేస్తున్నారు. ఆవిష్కరణలు, సాంకేతికత, భద్రత, సైబర్, వ్యవసాయం, వాతావరణ మార్పు రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత విస్తరించే లక్ష్యంగానూ ఈ పర్యటన జరగనుంది. ఈ వివరాలను ఇజ్రాయిల్ ప్రధాని విదేశీ మీడియా సలహాదారు ఒక ప్రకటనలో తెలిపారు. ‘భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నఫ్తలి బెన్నెట్ తొలిసారిగా ఏప్రిల్ 2 నుంచి భారత్లో పర్యటించనున్నారు’ అని తెలిపారు. గ్లాస్కోలో గత ఏడాది అక్టోబర్లో జరిగిన కాప్ 26 సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలూ తొలిసారి కలుసుకున్నారని, ఆ సమయంలో మోడీ ప్రధాని బెన్నెట్ను ఆహ్వానించారని ప్రకటన తెలిపింది. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 5 వరకూ భారత్లో పర్యటిస్తారని ప్రకటన పేర్కొంది.