ఒకే దేశం…ఒకే విద్య విధానం -ప్రధాని మోడీ

ఒకే దేశం.. ఒకే విద్యా విధానం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన జాతీయ విద్యా విధానం పై ప్రసంగిస్తూ రాష్ట్రాలన్నీ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ విద్యా విధానంలో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సు చదువుకోవచ్చని, పిల్లలు తమ లక్ష్యం చేరుకునేందుకు ఈ విద్యా విధానం సాయం చేస్తోందన్నారు. కొత్త విద్యా విధానంతో విస్తృత ప్రయోజనాలు కలుగుతాయన్నారు. 30 ఏళ్ల తర్వాత కొత్తగా జాతీయ విద్యా విధానం తీసుకువస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.21వ శతాబ్దానికి అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తెచ్చామని, దేశ భవిష్యత్‌ కోసమే నూతన విద్యా విధానమని తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానంపై ఆందోళన వద్దని.. రాష్ట్రాలన్నీ నూతన జాతీయ విద్యావిధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. ‘‘యువతలో విద్యా నైపుణ్యాలు పెంపొందించాలి. కొత్త ఆవిష్కరణల దిశగా యువత ఆలోచనలు సాగాలి. సిలబస్‌ పేరుతో భారీ పుస్తకాలు అవసరం లేదు. పిల్లల్లో మనోవికాసం పెంచే సిలబస్‌ మాత్రమే ఉండాలని’’ ప్రధాని తెలిపారు. జాతి నిర్మాణంలో నూతన విద్యావిధానం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.