కంగనా రనౌత్‌కు ఊరట

దేశ ద్రోహం కేసులో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు ఉపశమనం కలిగింది. ఈ కేసులో కంగనాతో పాటు ఆమె సోదరి రంగోలి ఛాందెల్‌లకు అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. వచ్చే ఏడాది జనవరి 8 న ముంబయి పోలీసుల ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ముంబైలోని బాంద్రా మేజిస్ట్రేట్‌ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా వీరిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కంగనా, ఆమె సోదరి సోషల్‌ మీడియాలో పోస్టుల ద్వారా విద్వేషం, మత ఉద్రిక్తతను రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఫిర్యాదు నేపథ్యంలో వారిపై విచారణ చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌తో పాటు అక్టోబర్‌ 17 న మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ కంగనా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎస్‌ఎస్‌.షిండే, ఎంఎఎస్‌.కర్నిక్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.