కరోనా నివారణకు అందరూ సహకరించాలి

కరోనా వైరస్‌ నుంచి కోలుకున్నవారు ప్లాస్మా దానం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ విజ్ఞప్తి చేశారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ ఈ రోజు మన దేశ స్వాతంత్ర్య సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అనేక అమర వీరులను, స్వాతంత్ర్య సమర యోధులను, దేశ భక్తులను గుర్తు చేసుకునే రోజు ఈరోజు. స్వాతంత్ర్య స్వేచ్ఛా ఫలాలను మనకు అందించిన అమర వీరుల ఆశయాలకు అనుగుణంగా సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావంతో, దేశ పురోగతికి ధృడ నిశ్చయంతో పునరంకితమయ్యే రోజు ఇది.కోవిడ్ -19 మహమ్మారి వలన దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోంటుంది. కరోనా వైరస్ మహమ్మారి ప్రజలకు అపారమైన నష్టాన్నికలిగించింది. సాధారణ జన జీవన విధానానికి భంగం కలిగించింది. అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించి, కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాను. సాధ్యమైనంతవరకు ఇళ్ళల్లోనే ఉండాలి. అనవసర ప్రయాణాలు మానుకోవాలి. సామాజిక దూరం పాటించడం, సబ్బు లేదా శానిటైజర్‌తో చేతులు కడుక్కోవడం, బహిరంగ ప్రదేశాలలో ఫేస్ మాస్క్ ధరించడం ద్వారా కోవిడ్ పై విజయం సాధించవచ్చు. కోవిడ్ -19 వైరస్ బారి నుండి పూర్తిగా కోలుకున్న వారందరికీ, వారి ప్లాస్మాను దానం చేసి, వైరస్ సంక్రమణతో పోరాడుతున్న రోగులకు సహాయం చేయమని స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కోవిడ్ వైరస్ ను జయించిన వారు ఈ సంక్షోభాన్ని అధిగమించడంలో ప్రభుత్వానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నివారణకు అందరూ సహకరించాలని మరోసారి ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అని గవర్నర్‌ అన్నారు.