ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యలలో భాగంగా ఈ ఆదివారం (మార్చి 22) జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రజలందరూ ఆదివారం ఉదయం గం.7 నుంచి రాత్రి గం. 9 వరకు బహిరంగ ప్రదేశాలలోకి రాకుండా ఇంటి వద్దనే ఉండాలని ప్రధాని ఇచ్చిన పిలుపును ఇప్పుడందరూ స్వాగతిస్తున్నారు. అందులో భాగంగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలంటూ ఓ వీడియో సందేశాన్ని పంపారు.
‘‘కరోనా వైరస్ను నియంత్రించడానికి క్షేత్రస్థాయిలో అహర్నిశలు 24 గంటలు పనిచేస్తున్న డాక్టర్స్, నర్సులు, ఇతర ఆరోగ్య బృందానికి, స్వచ్ఛ కార్మికులకు, పోలీసు శాఖకి, ఆయా ప్రభుత్వ అధికారులకు మనం హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తూ ప్రశంసించాల్సిన సమయమిది. దేశ ప్రధాని పిలుపుకు స్పందిస్తూ ఆదివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు మనం అందరం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూని పాటిద్దాం. ఇళ్లకే పరిమితమవుదాం. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరూ మన గుమ్మాల్లోకి వచ్చికరతాళ ధ్వనులతో సేవలందిస్తున్న ధన్యవాదలు తెలపాల్సిన సమయమిది. అది మన ధర్మ. భారతీయులుగా మన అందరం ఐకమత్యంతో ఒకటిగా నిలబడదాం. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందాం. సామాజిక సంఘీభావం పలుకుదాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం. ..జైహింద్’’ అని పిలుపునిచ్చారు చిరంజీవి.