కుటుంబసభ్యులతో కలసి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని మంగళవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కుటుంబసభ్యులతో కలసి దర్శించుకున్నారు. రాష్ట్రపతి వెంట రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఉన్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు టిటిడి ఛైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి, జెఈవో పి.బసంత్‌కుమార్‌, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చక బృందంతో కలిసి ఇస్తికఫాల్‌ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను వారికి ఛైర్మన్‌ అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా, ఇంటెలిజెన్స్‌ ఐజి శశిధర్‌ రెడ్డి, టిటిడి సివిఎస్‌ఒ గోపినాథ్‌ జెట్టి, తిరుపతి అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డి, అదనపు సివిఎస్‌ఒ శివకుమార్‌ రెడ్డి, విజిఒ మనోహర్‌, డిప్యూటీ ఇఒ ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.