చిరంజీవి చెల్లెలిగా కీర్తి సురేష్‌..!

 మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తోన్న తదుపరి చిత్రంలో కీర్తి సురేష్‌ ఖరారయ్యారని తెలుస్తోంది. తమిళ బ్లాక్‌బస్టర్‌ సినిమా ‘వేదాళం’కు ఇది రీమేక్‌. ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి నటించనున్నారు. ఈ చిత్రానికి మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సిస్టర్‌ రోల్‌ కీలకమైనది కావడంతో తొలి నుండి బడా హీరోయిన్‌ను తీసుకోవాలని మొగ్గు చూపింది చిత్రయూనిట్‌. ఒక దశలో సాయి పల్లవి.. ఇతర నటీమణుల పేర్లు కూడా వినిపించాయి. అయితే చిరంజీవే కీర్తి పేరును సూచించారని సమాచారం. ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. రాబోయే నెలలో దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయనుంది. ప్రస్తుతం కీర్తి తెలుగులో మహేష్‌ బాబుతో సర్కార్‌ వారి పాట, నితిన్‌తో రంగ్‌దేలో నటిస్తోంది. గుడ్‌ లక్‌ సఖి, మిస్‌ ఇండియా విడుదలకు సిద్ధమయ్యాయి.