డ్రగ్ కేసులో బెయిల్ నిరాకరణ.. హైకోర్టుకు వెళ్తున్న హీరోయిన్లు

కన్నడ సినీ పరిశ్రమలో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో హీరోయిన్లు సంజన గల్రాని, రాగిణి ద్వివేది అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వీరి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. సంజన, రాగిణికి బెయిల్ మంజూరు చేయడానికి ప్రత్యేక (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సస్ యాక్ట్) కోర్టు నిరాకరించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరికొంత మంది బెయిల్ పిటిషన్లను ఈరోజు (సెప్టెంబర్ 30న) కోర్టు విచారించనుంది.

మరోవైపు ఇదే కేసులో నిందితులుగా ఉన్న శివప్రకాష్, వినయ్ కుమార్‌ల యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది. అలాగే, ఈవెంట్ మేనేజర్ విరేన్ ఖన్నా, వ్యాపారవేత్త ప్రశాంత్ రంక, టెకీ ప్రతీక్ శెట్టి, మోడల్ నియాస్ మహమ్మద్, బులియన్ ట్రేడర్ వైభవ్ జైన్‌ల బెయిల్ పిటిషన్లను కోర్టు వాయిదా వేసింది. ఖన్నా బెయిల్ పిటిషన్‌ విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేయగా మిగిలిన వారందరి పిటిషన్లను ఈరోజు విచారించనుంది.

కాగా, బెయిల్ కోసం సంజన, రాగిణి హైకోర్టుకు వెళ్లనున్నట్టు డిఫెన్స్ అడ్వకేట్స్ వెల్లడించారు. ‘‘ఆర్డర్స్ కాపీల కోసం మేం దరఖాస్తు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన తరవాత కొన్ని రోజుల్లో హైకోర్టును ఆశ్రయిస్తాం’’ అని చెప్పారు.