తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాలలో కరోనా నిబంధనలను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లాలో తొలిరోజు ఒక్క సెంటర్లోనే పరీక్ష జరగనుందని, రేపటి నుండి ఎనిమిది సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 1,43,165 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. తెలంగాణలో 79, ఎపిలో 23 చొప్పున మొత్తం 20 టెస్ట్ జోన్లలో 102 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,10,11,14 తేదీలలో ప్రతి రోజు రెండు విడతల చొప్పున మొత్తం ఎనిమిది విడతల్లో ఈ పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుండి 12గంటల వరకు మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా ఉన్న వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అలాగే ఇప్పుడు పాజిటివ్గా నిర్థారణైన విద్యార్థులకు చివర్లో ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మాస్క్, శానిటైజర్ తప్పనిసరి అని అన్నారు.