దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి(57) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా 15 రోజుల క్రితం ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. అది ఇన్‌ఫెక్షన్‌ కావడంతో హైరదాబాద్‌లోని ఓ ప్రయివేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన్ను గచ్చిబౌలిలోని మరో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. దుబ్బాక మండలం చిట్టాపూర్‌కు చెందిన రామలింగారెడ్డి 2004,2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దొమ్మాట నియోజకవర్గం నుంచి తెరాస తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడిన తార్వత 2014, 2018 సార్వత్రిక ఎన్నికలలోనూ గెలుపొందారు. ప్రస్తుతం శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కీలక భూమిక పోషించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రామలింగారెడ్డి మృతి పట్ల సిఎం కేసిఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.