నేటి నుండి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కఠిన ఆంక్షలు

నేటి నుండి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కఠిన ఆంక్షలను అమలుచేయనున్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో.. ఎపి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మంగళవారం నుండి విమానాశ్రయ ఆవరణలోకి ప్రయాణికులను మాత్రమే అనుమతించనున్నారు. కారులో వచ్చిన ప్రయాణికుడి వెంట డ్రైవర్‌ కు మాత్రమే అనుమతి ఉంటుంది. స్వాగతం, వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువులను ప్రధాన ద్వారం వద్దనే ఆపుతారు. ప్రస్తుతం విదేశీ ప్రయాణికులకు మాత్రమే కోవిడ్‌ వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇకపై దేశ నలుమూలల నుంచి రాష్ట్రానికి చేరుకొనే ప్రతీ ప్రయాణికులకు కూడా కోవిడ్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ నిర్దారణ అయిన ప్రయాణికులను వెంటనే క్వారంటైన్‌ కు తరలించేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.