ప్రభుత్వ పరిధిలోకి సోషల్‌మీడియా

సోషల్‌మీడియా, ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌పై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఇకపై ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్స్‌ అయిన నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, హాట్‌స్టార్‌లతో పాటు సోషల్‌మీడియా వేదికలైన ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నాయి. ఇవన్నీ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేసిన ఉత్తర్వులను సోమవారం జారీ చేసింది. ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లోని సినిమాలు, ఆడియో విజువల్స్‌, వార్తలు, కరెంట్‌ అఫైర్స్‌ వంటి అన్నింటినీ సమాచార మంత్రిత్వ శాఖ తన పరిధిలోకి తీసుకోనుంది. ఇప్పటివరకు డిజిటల్‌ వేదికగా సమాచారాన్ని నియంత్రించే చట్టం కాని, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ కాని లేవు. ప్రింట్‌ మీడియాను ప్రెస్‌కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, వార్తా చానెళ్లను న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌బిఎ) పర్యవేక్షిస్తున్నాయి. అదేవిధంగా ప్రకటనలను అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సినిమాలను సెంట్రల్‌ బోర్డ్‌ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సిబిఎఫ్‌సి) నియంత్రిస్తుంది. కాగా, ఒటిటి ప్లాట్‌ఫామ్‌లను కూడా నియంత్రించేలా ఒక సంస్థను నియమించాలన్న పిటిషన్‌పై గత నెల సుప్రీంకోర్టు ప్రభుత్వ స్పందన కోరింది. ఈ మేరకు కేంద్రం, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఇంటర్నెట్‌, మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.