ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ ఇండియాకు ఢిల్లీ అసెంబ్లీ శాంతి, సామరస్య కమిటీ మరోసారి నోటీసులు జారీ చేసింది. బుధవారం జరిగే విచారణకు హాజరుకావాలని, హాజరుకావడానికి నిరాకరిస్తే శిక్షాత్మక చర్యలు ఉంటాయని ఫేస్బుక్ ఇండియా అధిపతి అజిత్ మోహన్కు శుక్రవారం జారీ చేసిన నోటీసుల్లో కమిటీ హెచ్చరించింది. ‘నోటీసును విస్మరించడం, ఖండించడం ఉద్దేశపూర్వకంగా చేసిన ఉల్లంఘన చర్యగా పరిగణించబడుతుంది. తద్వారా ఫేస్బుక్ ఇండియాకు వ్యతిరేకంగా ప్రారంభించిన వివిధ చర్యలకు ప్రేరేపించబడుతుంది’ అని కమిటీ చైర్పర్సన్ రాఘవ్ చధా ఒక ప్రకటనలో తెలిపారు. ఫేస్బుక్కు ఇదే చివరి అవకాశంగా హెచ్చరించారు. కాగా, విచారణకు హాజరుకావాలని గతంలో ఇచ్చిన నోటీసులను ఫేస్బుక్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. సమాచార నియంత్రణ కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలకు సంబంధం లేదని సమాధానం ఇచ్చింది. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన మతఘర్షణల సమయంలో ద్వేషపూరిత సమాచారాన్ని ప్రచారం చేసిందని ఫేస్బుక్ ఆరోపణలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.