బిజెపిలో చేరిన 24 గంటల్లోనే రాజకీయాలకు గుడ్‌బై.

బిజెపిలో చేరిన 24 గంటల్లోనే రాజకీయాలకు గుడ్‌బై..!

భారత్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌ మాజీ ఆటగాడు మెహతాబ్‌ హుస్సేన ఎంతో ఉత్సాహంగా బిజెపిలో చేరాడు. మంగళవారం నాడు ఆయనకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ పార్టీ జెండాను అందించి చేర్చుకున్నారు. కానీ 24 గంటల్లోనే సీన్‌ రివర్స్‌ అయ్యింది. మెహతాబ్‌ రాజకీయాలనుండి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించారు. తన వ్యక్తిగత కారణాల రీత్యానే రాజకీయాల నుండి తప్పుకుంటున్నానని, ఎవరి ఒత్తిడి లేదని చెప్పారు. బిజెపిలో చేరాలన్న తన నిర్ణయం కారణంగా బాధపడ్డ తన బంధువులకు, స్నేహితులందరికీ క్షమాపణలు చెప్పాడు. ఈరోజు నుండి తనకు ఏ పార్టీతోని సంబంధం లేదని ఈస్ట్‌ బెంగాల్‌ మాజీ కెప్టెనయిన మెహతాబ్‌ చెప్పారు. భారత్‌ పుట్‌బాల్‌ టీమ్‌ తరపున 30 మ్యాచ్‌లు ఆడిన మెహతాబ్‌ రెండు గోల్స్‌ చేశాడు. తన భార్య, పిల్లలు కూడా రాజకీయాల్లో చేరాలన్న తన నిర్ణయాన్ని అంగీకరించలేదని మెహతాబ్‌ చెప్పారు.