బైక్ ఆక్సిడెంట్ లో సాయిధరమ్‌ తేజ్‌

బైక్‌ రైడింగ్‌ చేస్తూ మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ శుక్రవారం రాత్రి గాయపడ్డారు. ప్రమాదంలో ఆయన కుడికంటిపై భాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. బైక్‌తో ఆయన కింద పడిపోవడాన్ని గమనించిన స్థానికులు 108 వాహనానికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రథమ చికిత్స అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను పోలీసులు నటుడు సాయిధరమ్‌ తేజ్‌గా గుర్తించి మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సాయితేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కాలర్‌ బోన్‌ విరిగిందని శరీరంలోని అంతర్గతంగా గాయాలేవీ లేవని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని వివరించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న జనసేన అధినేత, నటుడు పవన్‌కల్యాణ్‌, సినీ దర్శకుడు త్రివిక్రమ్‌, అల్లు అరవింద్‌, సందీప్‌ కిషన్‌ తదితరులు ఆసుపత్రికి తరలివచ్చారు. వైద్యులతో మాట్లాడిన అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.