భారత్‌కు చేరుకున్న మరో 1200 ఆక్సిజన్‌ సిలిండర్లు

కరోనా రెండవ ఉప్పెనలో కొట్టుమిట్టాడుతున్న భారత్‌కు సాయం అందించేందుకు పలు దేశాలు ముందుకు వచ్చాయి. అందులో భాగంగా బ్రిటన్‌ పంపిన మరో 1200 ఆక్సిజన్ల సిలిండర్లు భారత్‌కు గురువారం చేరుకున్నాయి. ఈ ఆక్సిజన్‌ సిలిండ్లరు భారత్‌కు సరఫరా చేసేందుకు సహకరించిన ఖతర్‌ ఎయిర్‌ వేస్‌కు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిండమ్‌ బగ్చి కృతజ్ఞతలు తెలిపారు. ‘యుకెలోని బ్రిటీష్‌ ఆక్సిజన్‌ కంపెనీ నుండి 1200 ఆక్సిజన్‌ సిలిండర్లను బహుమతిగా పొందాము. వీటిని తీసుకువచ్చేందుకు సహకారం అందించిన ఖతర్‌ ఎయిర్‌ వేస్‌కు ధన్యవాదాలు’ అని ట్వీట్‌ చేశారు. సోమవారం బ్రిటీష్‌ కంపెనీ 1350 ఆక్సిజన్‌ సిలిండర్లను పంపిన సంగతి విదితమే. కరోనా పోరులో భాగంగా భారత్‌కు ప్రపంచ దేశాలు మద్దతు తెలుపుతూ..సాయం చేసేందుకు ఆపన్న హస్తం అందించాయి. ఆరోగ్య మౌలిక సదుపాయాల లేమితో ఇబ్బందులను ఎదుర్కొంటున్న భారత్‌కు మెడికల్‌ పరికరాలు, ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు, పిపిఇ కిట్లు, మెడికల్‌ సాయం అందిస్తామని హామీనిచ్చాయి.