మరోసారి 50వేలకు పైగా పాజిటివ్‌ కేసులు..

దేశంలో కొంతమేర తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల్లో మరోసారి పెరుగుదల కనిపిస్తోంది. గతకొన్ని రోజులుగా 50వేల కన్నా తక్కువ కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. బుధవారం 46,253 కేసులు నమోదు కాగా, మంగళవారం 38,310 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 50,210 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. అదే సమయంలో 55వేల మంది కరోనా నుండి కోలుకున్నట్లు వెల్లడించింది. పండుగల సీజన్‌ కావడం, మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగడం… నేపథ్యంలో కేసులలో పెరుగుదల కనిపిస్తోంది. అలాగే గడిచిన 24 గంటల్లో 704 మంది మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,24,315కి చేరింది. మొత్తం కేసుల సంఖ్య 83,64,086కి పెరిగింది. అలాగే యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,27,962గా ఉండగా.. ఈ రేటు 6.31 శాతానికి తగ్గింది. వైరస్‌ నుండి కోలుకున్న వారి శాతం 92.20గా ఉంది. ఇప్పటివరకు 77,11,809 మంది కోలుకున్నారు.