రోజుకి 95 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు

 దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశంలో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. రోజుకి లక్ష కేసుల వరకు నమోదవుతున్నాయి. బుధవారం కూడా 95వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మరే దేశంలోనూ రోజుకి లక్ష కేసులు నమోదవలేదు, దగ్గరగాను రాలేదు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 1,172 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 75,062కి చేరింది. అలాగే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 95,735 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసుల సంఖ్య 44,65,863కి పెరిగింది. 9,19,018 యాక్టివ్‌ కేసులు ఉండగా, 34,71,783 మంది కోలుకుని ఆస్పత్రినుండి డిశ్చార్జ్‌ అయ్యారు. కాగా, రికవరీ రేటు 77.77 శాతానికి మెరుగుపడిందని వైద్య శాఖ పేర్కొంది. బుధవారం 61 శాతం కేసులు ఐదు రాష్ట్రాల నుండే నమోదయ్యాయని వెల్లడించింది.