18 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 18వ తేదీ ఉదయం పది గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నరు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ భేటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను 16వ తేదీన ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. శాసనమండలి చైర్మన్‌, శాసనసభ స్పీకరు నేతృత్వంలో జరిగే ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పలు శాఖల స్పెషల్‌ సిఎస్‌లు, కార్యదర్శులు హాజరు కావాలని కోరుతూ శాసనసభ సచివాలయ కార్యదర్శి లేఖ రాశారు. ఇదే సమయంలో 17వ తేదీన మంత్రివర్గం కూడా భేటీ కానుంది. ఈ భేటీలో శాసనసభలో అనుసరించాల్సిన వ్యూహం, చర్చించాల్సిన అంశాలను ఖరారు చేయనున్నారు. ప్రతిపక్షాలు లేవనెత్తే కీలక అంశాలపై ఎలా స్పందించాలన్నదానిపైనే చర్చించనున్నారు.