విశాఖలో విద్యార్థులపై కరోనా పంజా..

విశాఖలో పాఠశాల విద్యార్థులపై కరోనా పంజా విసురుతోంది. నగరంలోని గోపాలపట్నం, ఎల్లపువానిపాలెం జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎల్లపువానిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులకు, కొత్తపాలెంకు చెందిన ఒక విద్యార్థి, సంతోష్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన మరో ఇద్దరు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న జివిఎంసి అధికారులు పాఠశాల ప్రాంగణం, విద్యార్థుల ఇళ్ల వద్ద శానిటేషన్‌ చేయించారు. కాగా, కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉండటం.. థర్డ్‌వేవ్‌లో పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు తెరిచిన సంగతి తెలిసిందే.