ఏపీ లో కరోనా అలర్ట్: కొత్తగా 67 కేసులు.. ఆ ఒక్క జిల్లాలో 516, మొత్తం 1717

ఏపీని కరోనా పంజా విసురుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. గత వారం రోజులుగా 60కుపైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా మరో 67 పాజిటివ్ కేసులు నమోదైనట్లు మంగళవారం బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కర్నూలు జిల్లాలో 25, గుంటూరు జిల్లాలో 13, కృష్ణా జిల్లాలో 8.. విశాఖ, అనంతపురం, కడప జిల్లాల్లో రెండేసి చొప్పున.. నెల్లూరు జిల్లాలో ఒకటి.. ఇతర కేసులు 14 ఉన్నాయి. తాజా కేసులు కలిపితే మొత్తం కేసుల సంఖ్య 1717 కాగా.. డిశ్చార్జ్ అయిన వారు కాకుండా యాక్టివ్ కేసులు 1094గా ఉన్నాయి.

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 516 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 351 కేసులు ఉన్నాయి.. ఇక కృష్ణా జిల్లా కూడా 286 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 589మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో 34మంది చనిపోయారు. అయితే ఇవాల్టి లెక్కల్లో కర్నూలు జిల్లాలోనే 25 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

జిల్లాల వారీగా మొత్తం కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు జిల్లా -516
గుంటూరు జిల్లా – 315
కృష్ణా జిల్లా – 286
నెల్లూరు జిల్లా -92
కడప జిల్లా -89
చిత్తూరు జిల్లా – 82
అనంతపురం జిల్లా -80
ప్రకాశం జిల్లా – 61
పశ్చిమ గోదావరి జిల్లా – 59
తూర్పుగోదావరి జిల్లా – 45
విశాఖపట్నం జిల్లా -37
శ్రీకాకుళం జిల్లా – 5
మొత్తం కేసులు -1717