దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నాం

దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నామని, ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరాలని తాలిబన్‌ మంగళవారం ప్రకటించింది. ”దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నాం.. మీ కార్యక్రమాలను పూర్తి భరోసాతో, విశ్వాసంతో తిరిగి ప్రారంభించండి” అని ఒక ప్రకటనలో పేర్కొంది. తాలిబన్‌ల నుండి ప్రకటన వచ్చిన కొన్ని నిమిషాల్లోనే కాబూల్‌ విమానాశ్రయంలో ఒక పౌరుడిపై కాల్పులు జరిపిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అన్ని సరిహద్దులను మూసివేయడంతో దేశం నుండి పారిపోయేందుకు వేలాది మంది ప్రజలు కాబూల్‌ విమానాశ్రయానికి చేరుకున్న సంగతి తెలిసిందే. కాబూల్‌ విమానాశ్రయంలోకి ప్రవేశిస్తున్న ఒక పౌరుడిపై తాలిబన్‌ సైనికుడు కాల్పులు జరిపిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. విమానాశ్రయంలోకి వెళ్లేందుకు యత్నిస్తున్న ఒక పౌరుడిపై అక్కడి సైన్యం కాల్పులు జరిపింది. వాస్తవానికి ఆ పౌరుడు తాలిబన్‌లు గతంలోని ఆఫ్ఘన్‌ సైనికుల మాదిరిగా ప్రవర్తిస్తారని భావించాడు. కానీ తాలిబన్‌లు కాల్పుల రూపంలో అతనికి సమాధానమిచ్చారని ఆ వీడియోకు ట్యాగ్‌ చేసింది.