అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేశామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సిఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు రెండో విడత నగదు మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో దశ కింద రూ.20 వేల లోపు 7 లక్షల మంది డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేశామని తెలిపారు. ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, పేద ప్రజల కోసం ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని అన్నారు.
