యూజీ, పీజీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్
యూజీ, పీజీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్

యూజీ, పీజీ పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి సురేష్

పదో తరగతి పరీక్షల మాదిరి యూజీ, పీజీ పరీక్షలు రద్దయ్యే అవకాశం లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తున్నామే తప్ప రద్దన్న ప్రశ్న ఉత్పన్నమే కాలేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరీక్షల నిర్వహణ, రాబోయే విద్యా సంవత్సరంలో చేయాల్సిన పనులపై రాష్ట్రంలో ఉన్న 16 యూనివర్సిటీల వీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితులపై ఏ విధంగా ముందుకు వెళ్లాలో సమీక్షించారు.

అనంతరం మంత్రి సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో సీఎం జగన్ నాయకత్వంలో కరోనా నియంత్రణపై స్పష్టమైన జాగ్రత్తలతో ముందుకు వెళ్తున్నామన్నారు. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదురావుతాయనే ముందుగానే తొమ్మిదో తరగతి లోవు పరీక్షలు రద్దు చేశామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించాలనుకున్నా కేసులు పెరుగుతున్నందున రద్దు చేశామన్నారు.యూజీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు పరిస్థితులపై అవగాహన ఉంటుందని.. ఒక్కో యూనివర్సిటీలో ఒక్కొక్క రకమైన పరిస్థితి ఉందన్నారు. పరీక్షలు నిర్వహించాల్సి వస్తే ఎలా చేయాలి.. రద్దు చేయాల్సి వస్తే ఏమి చేయాలి అని పూర్తిగా కసరత్తు చేశామని మంత్రి తెలిపారు. ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి గురువారం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకూ పరీక్షలు రద్దు చేస్తున్నామని ప్రకటించలేదని.. ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం అకాడమిక్ క్యాలెండర్‌ను రూపొందిస్తామని మంత్రి సురేష్ తెలిపారు.