ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండో సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులకు కూడా పరీక్షలను రద్దు చేసి పాస్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు శనివారం మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలుతున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ కూడా విడుదల అయిందని.. అయితే దీన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన వారిని సైతం పాస్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో 2019- 2020 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ విద్యార్థులంతా పాస్ అయినట్లేనని స్పష్టం చేశారు.