ఏపీలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. అంతేకాకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో కేవలం వారం రోజుల ముందు ఎస్ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మే 21న ఇచ్చిన తీర్పునిచ్చారు. పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి నిర్వహించేందుకు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల కోడ్ విధించాలని స్పష్టం చేశారు. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎస్ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. కాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈనెల 18వ తేదీన పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.