వైయస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు..అనుమానితుడు సునీల్‌ యాదవ్‌ అరెస్ట్‌

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ వేగం పెంచింది. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య అనుమానితుడు పులివెందులకు చెందిన సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను గోవాలో సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం అధికారులు ధ్రువీకరించారు. గోవాలో సోమవారం అరెస్ట్‌ చేసిన అనంతరం అక్కడి స్థానిక కోర్టులో హాజరు పరిచినట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.

గోవా స్థానిక కోర్టు ద్వారా సునీల్‌ యాదవ్‌ను ట్రాన్సిట్‌ రిమాండ్‌లో ద్వారా కడప తీసుకొచ్చారు. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్‌ కుమార్‌ను ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. ఈ క్రమంలోనే ఆయన్ను అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది.మరోవైపు ఈ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. అరెస్ట్‌ చేసిన సునీల్‌ యాదవ్‌తో పాటు వివేకా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌తో పాటు మరొకరిని విచారిస్తున్నారు.