సీఐడీ అదుపులో మాజీ మంత్రి గంటా సన్నిహితుడు

సీఐడీ అదుపులో మాజీ మంత్రి గంటా సన్నిహితుడు

విశాఖలో టీడీపీ సానుభూతిపరుడు నలంద కిషోర్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్‌, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వంపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు మూడు రోజుల క్రితం సీఐడీ నోటీస్‌ ఇచ్చారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆయన్ను అరెస్ట్‌ చేసి రీజనల్‌ సీఐడీ కార్యాలయానికి తరలించారు.

నలంద కిషోర్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు సన్నిహితుడని తెలుస్తోంది.. సమాచారం అందుకున్న మాజీ మంత్రి సీఐడీ కార్యాలయానికి వెళ్లారు.

అర్ధరాత్రి ఓ సీనియర్ సిటిజన్‌ను అలా అరెస్ట్ చేయడం సరికాదని మాజీ మంత్రి మండిపడ్డారు. సోషల్ మీడియాలో వచ్చిన ఓ మేసేజ్‌ను ఆయన ఫార్వార్డ్ చేశారని.. తప్పు చేసిన వారిని వదిలేసి అర్ధరాత్రి ఇలా అదుపులోకి తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం తనను టార్గెట్ చేసినా తాను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు. అయితే గంటాను సీఐడీ అధికారులు ఆఫీస్‌లోకి అనుమతించలేదు.