ఈ రోజుల్లో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికీ షుగర్ వ్యాధి వస్తున్నది. ఈ దీర్ఘకాలిక వ్యాధి ఇంతలా పెరిగిపోవడానికి కారణం.. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిళ్లతో కూడిన జీవనవిధానమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఒక్కసారి మనం సుగర్ బారిన పడ్డామంటే.. దానికితగ్గ మెడిసిన్లు వాడటం ఎంత ముఖ్యమో, తగిన ఆహార నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఒంట్లో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టడం అసాధ్యం. కాబట్టి షుగర్ పేషెంట్లు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆకు కూరలు
షుగర్ పేషెంట్లకు అన్ని రకాల ఆకు కూరలు మంచివే. అయితే అన్నిటికంటే పాలకూర ఇంకా మంచిది. ఎందుకంటే దీనిలో కావాల్సినంత ఫైబర్ ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారం వెంటనే జీర్ణం కాకుండా చూస్తుంది. దీనివల్ల ఆహారంలోని చక్కెరలు ఒకేసారి రక్తంలో కలువకుండా ఉంటాయి. దీంతో షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉండదు.
కాయగూరలు
ఇక కాయగూరల విషయానికొస్తే.. మధుమేహం ఉన్నవారు టమాట, వం కాయ, బీరకాయ, గోకరకాయ, చిక్కుడుకాయ, బెండకాయ, క్యాబేజి, కాలీఫ్లవర్, బ్రకోలి, దోసకాయ, మునగకాయ, ఆనక్కాయ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అయితే, వీటన్నిటికంటే టమాటాలు మరింత శ్రేష్ఠమైనవి. వీటిలో కేలరీలు తక్కువ. C విటమిన్ ఉంటుంది. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారికి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టమాటాల్లో ఉండే విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తుంది.
బ్రకోలి
డయాబెటిస్ ఉన్నవారికి బ్రకోలీ కూడా మంచి ఆహారం. దీనిలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఫైబర్తోపాటు విటమిన్ A, C, K ఉంటాయి. దీంతో ఇది మన రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. బ్రకోలీలో గుండె సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది శరీరంలో వేడిని కూడా ఇది తగ్గిస్తుంది.
పప్పు దినుసులు
షుగర్ పేషెంట్ల ఆహారంలో పప్పు దినుసులు ఎక్కువగా ఉండేలా చూడాలి. పప్పు దినుసుల నుంచి లభించే ప్రొటీన్లు మాంసాహారంలో లభించే ప్రొటీన్ల కంటే మేలైనవి. ఇవి ప్రొటీన్లతోపాటు ఫైబర్స్ను కూడా అధికంగా కలిగి ఉంటాయి. ఈ రెండు పదార్థాలు రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంచుతాయి.