టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) విచారణను వేగవంతం చేసింది. మంగళవారం సినీ డైరెక్టర్ పూరీజగన్నాథ్ ఈడి విచారణకు హాజరయ్యారు. కుమారుడు ఆకాష్ పూరి, చార్టెడ్ అకౌంటెంట్ తో కలిసి పూరీజగన్నాథ్ ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఈ కేసుకు సంబంధించి పలు కీలక అంశాలపై ఈడీ ఆయన్ను ప్రశ్నించనుంది. విదేశీ బ్యాంక్ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. విదేశీ అక్రమ లావాదేవీలను గుర్తిస్తే ‘ఫెమా’ కేసులూ నమోదు చేసే యోచనలో ఉంది. ఈడీ వద్ద ఉన్న ఆధారాలకు అనుగుణంగా పూరీజగన్నాథ్ను అధికారులు విచారించనున్నారు. అవన్నీ లిఖితపూర్వకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. విచారణలో నిర్థారణ అయ్యే అంశాల ఆధారంగా సోదాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వీరిలో పూరీ జగన్నాథ్తో పాటు రానా దగ్గుబాటి, రకుల్ప్రీత్ సింగ్, చార్మి, రవితేజ, నవ్దీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులతోపాటు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు.