యూట్యూబ్‌ ఛానళ్లపై సమంత పరువునష్టం దావా

నాగచైతన్య-సమంత విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వెల్లువెత్తాయి. సమంత పిల్లలు వద్దనుకుందని కొందరు.. హెయిర్ స్టైలిస్ట్‌ జుకల్కర్‌, సమంత మధ్య ఎఫైర్ నడుస్తోందని మరికొందరు.. ఇలా ఎన్నో రకాల నెగటివ్ వార్తలు సమంతపై సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.విడాకుల విషయంలో సమంతదే తప్పంటూ పలువురు విమర్శించారు. ఇక వీటన్నింటిపై స్పందించిన సామ్.. ఇలాంటి సమయంలో ఈ రూమర్స్ బాధను కలిగిస్తున్నాయని.. తన ప్రైవసీకి భంగం కలిగించవద్దు అని కోరుతూ ఆవేదన వ్యక్తం చేసింది. అయినా పట్టించుకోకుండా పలు యూట్యూబ్ ఛానళ్లు సమంతపై నెగటివ్ ప్రచారం చేశాయి. దీనితో సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లేలా వార్తలు, కథనాలు ప్రసారం చేసిన మూడు యూట్యూబ్ ఛానళ్లపై కూకట్‌పల్లి కోర్టులో సమంత పరువు నష్టం దావా కేసు వేశారు. సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీలతో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్‌పైన సమంత పిల్ దాఖలు చేశారు. కాగా, బుధవారం సమంత తరపున హైకోర్టు న్యాయవాది బాలాజీ వాదనలు వినిపించనున్నారు.