కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతోంది. తాజాగా, మరో నెల రోజుల పాటు ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశీయ విమాన ప్రయాణాలను మే 25 నుంచి పునరుద్దరించినా, అంతర్జాతీయ సర్వీసులను మాత్రం ప్రారంభించలేదు. గతంలో విధించిన ఈ నిషేధం జులై 31తో ముగిసింది.
కేవలం ప్రయాణికుల విమానాలపై మాత్రమే నిషేధం కొనసాగుతుందని, సరకు రవాణా, డీజీసీఏ ఆమోదం తెలిపిన సర్వీసుల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని అధికారిక ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ విమానా సర్వీసులు నిలిచిపోవడంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు వందే భారత్ మిషన్ ద్వారా 2,500పైగా ప్రత్యేక విమానాలు నడిపటానికి అనుమతి ఇచ్చినట్టు తెలిపింది.