దర్శకుడు శంకర్, విలక్షణ నటుడు కమల్ హాసన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ సెట్లో రెండు రోజుల క్రితం భారీ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. మొన్న రాత్రి చెన్నైలోని ఈవీపీ స్టూడియోస్లో భారీ క్రేన్ కుప్పకూలింది. దాంతో ‘భారతీయుడు 2’ సినిమా కోసం పనిచేస్తున్న ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, లైట్ మెన్ అక్కడికక్కడే చనిపోయారు. కాజల్ అగర్వాల్, కమల్ హాసన్, శంకర్ వెంట్రుక వాసిలో తప్పించుకున్నారు. శంకర్ కాలు విరిగిందని తెలుస్తోంది.
మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారంతా ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే బాధిత కుటుంబాలకు కమల్ హాసన్ కోటి రూపాయలు సాయం చేస్తానని ప్రకటించారు. ఇది కేవలం ఆ కుటుంబాలు కోలుకోవడానికి ఇస్తున్న నష్టపరిహారమేనని, ముందు ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటామని అన్నారు. అయితే ఇది కేవలం తన బాధ్యత కాదని, చిత్ర పరిశ్రమకు చెందిన ఇతర సెలబ్రిటీలు కూడా సాయం చేస్తే బాగుంటుందని కమల్ తన మనసులో మాటను బయటపెట్టారు.