తెలంగాణలో మే 28 వరకు లాక్‌డౌన్..

తెలంగాణలో మే 28 వరకు లాక్‌డౌన్.. కేసీఆర్ సర్కారు సంకేతాలు!

తెలంగాణలో మే 28 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉందని సమాచారం. మంగళవారం జరగనున్న కేబినెట్ భేటీలో ఈ విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ.. మే నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగిస్తేనే ఫలితం ఉంటుందని ఆరోగ్య శాఖ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. కరోనాను కట్టడి చేయడం కోసం 70 రోజుల లాక్‌డౌన్ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మే 28వ తేదీతో రాష్ట్రంలో 70 రోజుల సైకిల్ పూర్తవుతుందని.. అందుకే ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను పొడిగించొచ్చనే భావన వ్యక్తం అవుతోంది.

రాష్ట్రంలోని మొత్తం కోవిడ్ కేసుల్లో 66.08 శాతం హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లోనే నమోదయ్యాయి. మరణాలు కూడా ఈ నాలుగు జిల్లాల్లోనే ఎక్కువ నమోదయ్యాయి. గత 10 రోజులుగా నమోదైన కేసులు కూడా ఈ జిల్లాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ జిల్లాల్లో జనసాంద్రత ఎక్కువ కావడంతో.. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చిన నివేదికపై మంగళవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆంక్షలు కొనసాగించాలా? సడలించాలా? అనే విషయమై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.