40ఏళ్లలో తొలిసారిగా ఆస్కార్ అవార్డులు వాయిదా.. !

కరోనా వైరస్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది. సినిమా రంగంపై కూడా ఈ వైరస్ ప్రభావం బాగానే చూపించింది. ఇప్పుడు దీని ప్రభావం సినీ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక అవార్డులైన ఆస్కార్ అవార్డులపై పడింది. ఆస్కార్ అవార్డ్స్ తేదీని వాయిదా వేస్తున్నట్టు ది అకాడమి ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగులకు బ్రేక్ పడటంతో.. 2021 ఫిబ్రవరి 28వ తేదీన జరగాల్సి ఉన్న కార్యక్రమాన్ని ఏప్రిల్ 25కు వాయిదా వేసినట్టు వెల్లడించింది. వచ్చే యేడాది 2021లో జరగనున్న ఈ అవార్డు వేడుకలను కరోనా మహామ్మారి కారణంగా రెండు నెలలు పాటు వాయిదా వేశారు. నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 25న అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం జరపబోతున్నట్టు ఆస్కార్ అవార్డుల కమిటీ వెల్లడించింది.

ఆస్కార్ అవార్డుల వేడుక వచ్చిందంటే సినీ ప్రముఖులతో పాటు.. సినీ అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. వందల మంది తారలు ఈ వేడుకలో తళుక్కున మెరుస్తుంటారు. అయితే, ప్రస్తుతం ప్రపంచ దేశాలను కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 25న అవార్డుల వేడుకను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సినిమాకు సంబంధించి వివిధ క్రాఫ్ట్‌లలో నైపుణ్యం చాటిన వారికి ఆస్కార్ అవార్డ్స్‌ను ప్రతి ఏటా అందజేస్తూ ఉంటారు. గడిచిన 40 ఏళ్లలో ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమాన్ని వాయిదా వేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.