టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా చరిత్ర సృష్టించాడు. బుధవారం 57 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో సెమీఫైనల్లో కజకిస్తాన్‌ రెజ్లర్‌ నూరిస్లామ్‌ సనయేవ్‌పై రవికుమార్‌ విక్టరీ బైఫాల్‌ కింద గెలుపొందాడు. సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఒక దశలో ప్రత్యర్థి నూరిస్లామ్‌ 9-2 లీడ్‌లోకి దూసుకెళ్లాడు. అయితే ఈ సమయంలో రవికుమార్‌ అతన్ని రింగ్‌ బయటకు తోసే క్రమంలో నూరిస్లామ్‌ కాలికి గాయమైంది. కాలికి కట్టుకొని మళ్లీ రింగులోకి వచ్చినా.. అతడు రవికుమార్‌ పట్టుకు నిలవలేకపోయాడు. దీంతో రిఫరీ రవికుమార్‌ను విక్టరీ బై ఫాల్‌ కింది విజేతగా ప్రకటించాడు. రవికుమార్‌ ఫైనల్‌ చేరడంతో భారత్‌ ఖాతాలో కనీసం రజతం ఖాయమైంది. ఇక ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ పురుషుల విభాగంలో పతకం తీసుకొచ్చిన మూడో రెజ్లర్‌గా రవికుమార్‌ నిలవనున్నాడు.