జర్నలిస్టు ఇంటిని ధ్వంసం చేసిన దుండగులు

చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరులో దుండగులు రెచ్చిపోయారు. ఓ జర్నలిస్టు ఇంటిని ధ్వంసం చేశారు. స్థానికుడైన వెంకట నారాయణ పదేళ్లగా జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు జర్నలిస్ట్ ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉండే సామాన్లు బయటకు విసిరేసి.. ధ్వంసం చేశారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరగ్గా.. జర్నలిస్టు ఈ దాడి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ అరాచకం బయటపడింది.

అదే గ్రామానికిపాఠశాల ఛైర్మెన్ గా ఉన్న గాలి భాస్కర్, గాలి సురేష్, మరి కొందరు వ్యక్తులు దాడి చేసి తన అస్తి ని ధ్వంసం చేశారని నారాయణ ఆరోపిస్తున్నారు. ఓ వార్త వారికి అనుకూలంగా రాయలేదని అక్కసుతో ఇంటిపై దాడి చేశారని.. తనను చంపేస్తామని బెదిరించారని చెబుతున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వీడియోలను కూడా వారికి అందించారు. ఈ ఘటనపై పోలీసులు కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇదంతా మంత్రి అనచరుల పని అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై వారు స్పందించాల్సి ఉంది.