వైఎస్ షర్మిల సారధ్యంలోని కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టిపి)గా నామకరణం చేశారు. వైఎస్ఆర్ జయంతి రోజైన జులై 8న అధికారికంగా పార్టీ పేరు, జెండా, విధి విధానాలను షర్మిల ప్రకటించనున్నారు. ఎన్నికల కమిషన్ ప్రక్రియ కూడా దాదాపుగా ముగిసిందని, త్వరలోనే ఇసి నుంచి లేఖ అందుతుందని షర్మిల రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త వాడుక రాజగోపాల్ తెలిపారు. పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు, కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. ఈ మేరకు ఆయన సోమవారం సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.
